యూపీ సీఎం యోగీ ఆదిత్యానాథ్ యూపీ ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచారు. తనదైన శైలిలో ప్రత్యర్ధులపై విరుచుకుపడటమే కాకుండా.. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కల్పించే అల్లరిమూకలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇటీవలే అబ్బాజాన్ అని మాట్లాడేవారంతా ఇంతకి ముందు రేషన్ సరుకుల్ని మింగేశారంటూ కొద్ది రోజుల క్రితమే యూపీలోని ఖుషినగర్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలు ముస్లిం వర్గాలను ఉద్దేశించి చేశారంటూ అక్కడి ప్రతిపక్షాలు యోగీపై విరుచుకుపడ్డారు. అయితే ప్రత్యర్ధి పార్టీలు, నెటిజన్లు ఎంత విరుచుకుపడ్డప్పటికీ.. యోగీ మాత్రం తన స్పీచ్ స్టైల్స్లో ఎలాంటి మార్పులు చేసుకోలేదు.
తాజాగా మంగళవారం నాడు కాన్పూర్లో మరోసారి అబ్బాజాన్ బోధకులే కాదు.. చాచా జాన్ బోధకులు అంటూ వ్యాఖ్యలు చేశారు. సీఏఏ పేరుతో ప్రజల్లో అలజడి సృష్టిస్తూ కొందరు రెచ్చగొడుతున్నారన్నారు. అలాంటి అబ్బాజాన్, చాచాజాన్ బోధకులను నేనే హెచ్చరిస్తున్నానన్నారు. మీరు ఆ ప్రయత్నాలు చేస్తే.. దానిని ఎలా కఠినంగా అరికట్టాలో తమకు తెలుసంటూ మరింత ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. రాష్ట్రంలో సమాజ్ వాదీ పార్టీ ఏజెంట్గా ఓవైసీ పనిచేస్తున్నారని ఆరోపించారు. ఇక రాష్ట్రంలో అల్లరిమూకలు తీరు మార్చుకోకపోతే.. వారి ఛాతిపై బుల్డోజర్లు ఎక్కుతాయని సీఎం యోగీ తీవ్ర హెచ్చరికలు చేశారు.