వైసీపీ ‘కల్తీ’ రాజకీయంపై ధూళిపాళ్ల సమరశంఖం: క్షమాపణకు డిమాండ్..

అమరావతి: పాలు, వెన్న వంటి కనీస పదార్థాలు లేకుండానే నెయ్యిని తయారు చేయగల ‘వింత విద్య’ ఒక్క వైసీపీ నాయకులకే సాధ్యమని టీడీపీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర ఎద్దేవా చేశారు. గురువారం ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మాట్లాడిన ఆయన, వైసీపీ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలు మరియు తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై ఘాటుగా స్పందించారు.

మహాపాపానికి క్షమాపణ చెప్పాల్సిందే!

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు, వెజిటబుల్ ఫ్యాట్ కలిసినట్లు ఎన్డీడీబీ (NDDB) నివేదికలు స్పష్టం చేశాయని ధూళిపాళ్ల పేర్కొన్నారు. కల్తీ నెయ్యి దందాలో అక్రమ సొమ్ము విజయవాడకు రూ. 12.5 కోట్లు, చెన్నైకి రూ. 7.5 కోట్లు చేరినట్లు సిట్ (SIT) విచారణలో తేలిందని వెల్లడించారు. “మార్కెట్‌లో వెన్న ధర రూ. 360 ఉంటే, కేవలం రూ. 316కే నెయ్యి ఎలా సరఫరా చేశారు?” అని ఆయన ప్రశ్నించారు. ఈ అపచారానికి వైసీపీ తక్షణమే భక్తులకు, ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

సర్వర్ల హ్యాకింగ్‌కు ప్రయత్నించినా ఏమీ దొరకలేదు

గత ప్రభుత్వ హయాంలో తనను 33 రోజుల పాటు అక్రమంగా జైల్లో పెట్టి, సంగం డెయిరీ సర్వర్లను హ్యాక్ చేయడానికి ప్రయత్నించారని ధూళిపాళ్ల గుర్తు చేశారు. “అణువణువూ జల్లెడ పట్టినా ఒక్క తప్పు కూడా పట్టుకోలేకపోయారు. వెబ్‌సైట్లు డౌన్ చేయడం, మార్పింగ్‌లు చేయడమే వైసీపీ పేటెంట్ హక్కులు” అని ఆయన మండిపడ్డారు.

బొత్స, పేర్ని నానిలపై ధ్వజం

  • బొత్స సత్యనారాయణ: కల్తీ నెయ్యి వ్యవహారాన్ని సమర్థించడం ద్వారా బొత్స దేవుడితో ఆటలాడుతున్నారని, ఇది ఆయనకు ఏమాత్రం మంచిది కాదని హితవు పలికారు.
  • పేర్ని నాని: బియ్యం దొంగతనాల ఆరోపణలు ఎదుర్కొంటున్న పేర్ని నాని నీతులు చెప్పడం హాస్యాస్పదమని విమర్శించారు. వైష్ణవి డెయిరీ గేట్లకు తాను రంగులు వేశానని చెప్పడం ఆయన అజ్ఞానానికి నిదర్శనమని కొట్టిపారేశారు.

అవినీతి లెక్కలు – కేసుల ఎత్తివేతపై విన్నపం

గత ఐదేళ్లలో అప్పటి సీఎం జగన్ తన సొంత మీడియా సంస్థలకు రూ. 307 కోట్ల విలువైన ప్రకటనలు ఇచ్చుకున్నారని ధూళిపాళ్ల ఆరోపించారు. అలాగే భారతీ సిమెంట్స్ ద్వారా 3 లక్షల టన్నుల సిమెంట్‌ను మాయం చేశారని విమర్శించారు. తనపై పెట్టిన 22 తప్పుడు కేసులను ప్రభుత్వం పునఃపరిశీలించి, అక్రమమని తేలితే వెంటనే ఎత్తివేయాలని ఆయన కోరారు.

సంగం డెయిరీ నాణ్యతపై సవాల్

సంగం డెయిరీ గుంటూరు రైతులదని, శ్రీజ డెయిరీ చిత్తూరు మహిళలదని ఆయన స్పష్టం చేశారు. దక్షిణ భారతదేశంలో అమూల్ తర్వాత అత్యంత నాణ్యమైన ఉత్పత్తులు అందించేది సంగం డెయిరీయేనని, ఈ విషయంలో ఎవరితోనైనా చర్చకు తాను సిద్ధమని ధూళిపాళ్ల నరేంద్ర సవాల్ విసిరారు.

AD

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *