న్యూఢిల్లీ : సీఎం సొంత జిల్లా గజ్వేల్ లో అధికార టీఆర్ఎస్ కు పెద్ద షాక్ తగిలింది. దుబ్బాక నియోజకవర్గంలోని సర్పంచ్ లు, ఎంపీటీసీలు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో ఢిల్లీలోని నివాసంలో బీజేపీ లో చేరారు. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ ఆధ్వర్యంలో ఇప్పటికే చేగుంట వైఎస్ ఎంపీపీ మున్నూరు రాంచంద్రం బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరగా ఇప్పుడు సర్పంచ్ లు చేరారు.
దుబ్బాక శాసనసభ్యులు మాధవనేని రఘునందన్ రావు ఆధ్వర్యంలో ఈరోజు ఢిల్లీలోని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి నివాసంలో వారి సమక్షంలో దుబ్బాక నియోజకవర్గానికి చెందిన ఆరుగురు టిఆర్ఎస్ సర్పంచ్ లు, టిఆర్ఎస్ ఎంపీటీసీ పలువురు టిఆర్ఎస్ నాయకులు బిజెపిలో చేరారు.
దౌల్తాబాద్ మండలం దీపాయంపల్లి సర్పంచ్ లావణ్య నర్సింహా రెడ్డి, కొనాయపల్లి సర్పంచ్ సురేందర్ రెడ్డి, ముత్యంపేట సర్పంచ్ బండి రాజు, లింగరాజుపల్లి సర్పంచ్ కేత కనకరాజు, లింగాయపల్లి సర్పంచ్ దేవి యాదగిరి, దుబ్బాక మండలం తాళ్ళపల్లి సర్పంచ్ ప్రియాంక యాదగిరి, మిరుదొడ్డి మండలం, ధర్మారం, ఆరేపల్లి, లక్ష్మీ నగర్ ఎంపీటీసీ చెప్యాల శ్రీనివాస్ తో పాటు పలువురు టిఆర్ఎస్ నాయకులకు కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రానున్నది బీజేపీ కాలమని, దుబ్బాకలో మొదలయిన మార్పు తెలంగాణ అంతటా ఉంటుందని , అధికార టీఆర్ఎస్ ను ప్రజలే కాదు సొంత పార్టీ కార్యకర్తలు కూడా నమ్మడం లేదన్నారు. ప్రధాని మోడీ బాటలోకే తెలంగాణ కూడా వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
తెలంగాణ కు కేంద్రం ఏమిచ్చిందో చెప్పగలమని , రాష్ట్ర ప్రభుత్వానికి దమ్ముంటే గ్రామీణాభివృద్ది శాఖ, పట్టణాభివృద్ది శాఖ నుంచి వచ్చిన నిధులపై శ్వేత పత్రం ఇవ్వగలదా అని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు రాష్ట్ర సర్కారుకు సవాల్ విసిరారు .