టీఎంసీ అధినేత్రి, వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ జాతీయగీతాన్ని అవమానించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాదు.. మమతా బెనర్జీ అసంపూర్తిగా పాడిన జాతీయగీతాన్ని.. ఆమె అవలంభించిన తీరును బీజేపీ బెంగాల్ ట్విట్టర్లో పోస్ట్ చేసింది. వివరాల్లోకి వెళితే.. ఇటీవల ముంబైలో జరిగిన ఓ విలేకరుల సమావేశంలో జాతీయ గీతాన్ని ప్రారంభించిన మమతా బెనర్జీ.. రెండు మూడు లైన్లు పాడి.. అనంతరం మధ్యలోనే జాతీయగీతాన్ని పాడటం ఆపేశారు. వెంటనే కుర్చిలో కూర్చున్నారు. అంతకుముందు కుర్చీ నుంచి పూర్తిగా నిలబడకుండానే జాతీయ గీతాన్ని ప్రారంభించారు. ఈ ఘటనతో ఆగ్రహం వ్యక్తం చేసిన ముంబైకి చెందిన ఓ బీజేపీ నేత.. ముంబై పోలీసులకు మమతా బెనర్జీపై ఫిర్యాదు చేశారు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న మమతా బెనర్జీకి జాతీయ గీతం పట్ల కనీస గౌరవం లేకపోవడం శోచనీయమని.. కావాలని జాతీయ గీతాన్ని అవమానించినట్లు అనిపిస్తోందని.. ఇది దేశ సంస్కృతిని.. ముఖ్యంగా బెంగాల్ సంస్కృతిని, జాతీయ గీతాన్ని, రవీంద్ర నాథ్ ఠాగూర్ను అవమానించినట్లేనని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.