న్యూఢిల్లీ: కేంద్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. ఈనెల 7న (బుధవారం) మధ్యాహ్నం 11 గంటలకు మోదీ 2.0 ప్రభుత్వం తొలిసారి కేబినెట్ విస్తరణ చేపట్టనుందని ఢిల్లీ వర్గాల సమాచారం. 2024లో జరిగే లోక్సభ ఎన్నికలే లక్ష్యంగా మంత్రివర్గంలో మార్పులు జరుగనున్నట్లు తెలుస్తోంది. కేంద్ర కేబినెట్లో గరిష్టంగా 81 మంది మంత్రులను స్థానం ఉండగా, ప్రస్తుతం 53 మంది మాత్రమే ఉన్నారు. దీంతో మరో 28 మందికి మంత్రులుగా అవకాశం లభించనుంది.
కేబినెట్ విస్తరణపై గత రెండు రోజులుగా ప్రధానితో కేంద్ర హోంమంత్రి అమిత్షా, బీజేపీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్లతో చర్చలు జరుపుతున్నారు. కేబినెట్ విస్తరణలో ఉత్తర్ప్రదేశ్తోపాటు బీహార్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం లభిస్తుందని తెలుస్తుంది. ఇందులో ముగ్గురు మాజీ సీఎంలు, ఓ మాజీ డిప్యూటీ సీఎంకు చోటు లభిస్తుందని సమాచారం. ఉత్తరాఖండ్ మాజీ సీఎం తీరత్ సింగ్ రావత్, అసోం మాజీ ముఖ్యమంత్రి శర్బానంద సోనోవాల్, మహారాష్ట్ర మాజీ సీఎం నారాయణ్ రాణే, బీహార్ మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీలకు కేబినెట్ బెర్తు దాదాపు కన్ఫామ్ అయ్యిందని తెలుస్తోంది.
వీరితోపాటు మధ్యప్రదేశ్ నుంచి జోతిరాధిత్య సింధియా, జబల్పూర్ ఎంపీ రాకేశ్ సింగ్.. బీహార్ ఎల్జేపీ నేత పశుపతి కుమార్ పరాస్, జేడీయూ నేత ఆర్సీపీ సింగ్.. ఉత్తర్ప్రదేశ్ అప్నాదళ్ అధినేత అనుప్రియా పటేల్, వరుణ్గాంధీ, రాంశంకర్ కథేరియా, అనిల్ జైన్, రీటా బహుగుణ జోషి, జాఫర్ ఇస్లాం.. మహారాష్ట్ర నుంచి బీజేపీ ఎంపీ హీనా గావిట్, భూపేంద్ర యాదవ్, పూనం మహాజన్, ప్రీతం ముండే.. లడఖ్ ఎంపీ జామ్యాంగ్ నాంగ్యాల్.. ఉత్తరాఖండ్ నుంచి అజయ్ భట్, అనిల్ బాలూనీ.. కర్ణాటక నుంచి ప్రతాప్ సిన్హా .. పశ్చిమ బెంగాల్ నుంచి జగన్నాథ్ సర్కార్.. హర్యానా నుంచి బ్రిజేంద్ర సింగ్ పేర్లు దాదాపు ఖారారైనట్లు తెలుస్తోంది.