భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ కు చెందిన రీజనల్ ఔట్ రీచ్ బ్యూరో ఈరోజు నగరంలోని నెక్లెస్ రోడ్డులో ‘ఫ్రీడమ్ వాక్’ ని నిర్వహించింది. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ కళాశాలలు, నెహ్రూ యువ కేంద్రం (ఎన్ వై కే), జాతీయ సేవా పథకం (ఎన్ ఎస్ ఎస్) వాలంటీర్లు ఈ ఫ్రీడమ్ వాక్ లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ జనరల్(దక్షిణ ప్రాంత) శ్రీ ఎస్ వెంకటేశ్వర్, పిఐబి, ఆర్వోబీ డైరెక్టర్ శ్రీమతి శృతి పాటిల్, ఆర్వోబీ డిప్యూటీ డైరెక్టర్ డా.మానస్ కృష్ణకాంత్ తో కలిసి ఎన్ఎస్ఎస్, ఎన్.వై.కే సమన్వయకర్తల సమక్షంలో త్రివర్ణ బెలూన్ లను గాల్లోకి విడుదలచేసి ఈ ఫ్రీడమ్ వాక్ ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎస్. వెంకటేశ్వర్ మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఆజాది కా అమృత్ మహోత్సవం ప్రాముఖ్యతను పౌరులకు తెలియజేయడమే ఈ ఫ్రీడమ్ వాక్ ముఖ్య ఉద్దేశమని అన్నారు. ఈ నెల 23 నుండి 29 వరకు నిర్వహిస్తున్న సందర్శనీయ వారోత్సవాలను (ఐకానిక్ వీక్) పురస్కరించుకొని సమచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన మీడియా విభాగాలైన పిఐబి, ఆర్ వోబీ, పబ్లికేషన్ డివిజన్, దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియో, స్వాతంత్య్ర ఉద్యమంలో ప్రాంతీయ స్వాతంత్య్ర సమరయోధుల ప్రాముఖ్యతను తెలియజేస్తూ వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తుందని ఆయన తెలియజేశారు.
ఆర్వోబీ, పీఐబీ డైరెక్టర్ శ్రీమతి శృతి పాటిల్ మాట్లాడుతూ యువతలో మన దేశం పట్ల గర్వించదగ్గ అనుభూతిని కలిగించడం, వారిని దేశ సేవలో భాగస్వాములను చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఎన్.వై.కే, ఎన్.ఎస్.ఎస్ వాలంటీర్లు , పౌరులు, కళాశాల విధ్యార్థులు పెద్ద సంఖ్యలో ఈ వాక్ లో పాల్గొని స్వాతంత్య్ర సమరయోధులు ఉటంకించిన మాటలు రాసి ఉన్న ప్లకార్డులను పట్టుకొని ఈ ఫ్రీడమ్ వాక్ లో పాల్గొన్నారు.